![]() |
![]() |
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి మరోసారి తీవ్రమైన ప్రాణ హాని బెదిరింపులు వచ్చాయి. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి ఆయనకు ఈ హెచ్చరికలు అందడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఈసారి ఏకంగా 20 కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ భారీ డిమాండ్ పెట్టారు దుండగులు. డబ్బులు ఇవ్వకపోతే ఈసారి నేరుగా టార్గెట్ చేస్తామని, ప్రాణాలు తీస్తామని అత్యంత ఘోరంగా హెచ్చరించడంతో ముంబై సినీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కాల్పుల ఘటన మరువకముందే ఈ తాజా పరిణామం చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.
ముంబై పోలీసుల కథనం ప్రకారం, నిన్న ఉదయం రోహిత్ శెట్టి వ్యక్తిగత సిబ్బంది ఫోన్కు ఒక ఆడియో క్లిప్ వచ్చింది. సుమారు 90 సెకన్ల నిడివి గల ఈ ఆడియో సందేశంలో గ్యాంగ్స్టర్లు అత్యంత భీకరమైన హెచ్చరికలు చేశారు. "గత ఫిబ్రవరిలో మీ ఇంటిపై జరిపిన కాల్పులు కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది. మేము డిమాండ్ చేసిన 20 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే, ఈసారి బుల్లెట్లు నేరుగా నీకే తగులుతాయి" అంటూ ఆ ఆడియోలో స్పష్టంగా బెదిరించారు. ఈ వాయిస్ లారెన్స్ బిష్ణోయ్ ముఖ్య అనుచరుడైన శుభం లోంకర్దేనని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. ఈ శుభం లోంకర్ గతంలో సంచలనం సృష్టించిన నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులోనూ, అలాగే రోహిత్ శెట్టి ఇంటిపై జరిగిన దాడిలోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
రోహిత్ శెట్టి సిబ్బంది ఆలస్యం చేయకుండా ఈ 90 సెకన్ల ఆడియో క్లిప్ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు అందజేశారు. ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు, ఆ గొంతు శుభం లోంకర్దేనని భావిస్తున్నప్పటికీ, పూర్తి ఆధారాల కోసం దానిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్ అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణను వేగవంతం చేశారు. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో రోహిత్ శెట్టి భద్రతను కూడా పోలీసులు మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.
నిజానికి రోహిత్ శెట్టికి బిష్ణోయ్ గ్యాంగ్ నుండి ముప్పు రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జుహూలోని ఆయన నివాసం వెలుపల గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఐదు రౌండ్ల పాటు కాల్పులు జరిపి కలకలం రేపారు. ఆ దాడికి తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ ముఠా అప్పట్లోనే ప్రకటించుకుంది. ఆ కేసులో బైక్పై వచ్చి కాల్పులు జరిపిన దీపక్ శర్మ అనే నిందితుడిని పోలీసులు ఆగ్రాలో అరెస్ట్ చేశారు. ఆ కాల్పుల ఘటనకు సంబంధించి ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఏప్రిల్ నెలలో ఏకంగా 1,624 పేజీల భారీ చార్జిషీట్ను కోర్టులో దాఖలు చేశారు. ఇందులో మొత్తం 15 మందిని నిందితులుగా పేర్కొనగా, ప్రవీణ్ లోంకర్, ఆర్జో బిష్ణోయ్లను పరారీలో ఉన్నవారిగా ప్రకటించారు. ఇంతటి సుదీర్ఘ దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే, మళ్లీ 20 కోట్ల రూపాయల డిమాండ్తో ప్రాణాలకే ముప్పు ఉందంటూ ఆడియో క్లిప్ రావడం బాలీవుడ్లో ఒకింత భయాందోళనలను రేకెత్తిస్తోంది.
![]() |
![]() |